మనిషిని మనిషిగ చూడలేని సమాజం! ఒకే దేశంలో… ఒకే సమాజంలో… కొంతమందిని దేవుని పిల్లలుగా చూసి గౌరవిస్తే, మరికొంతమందిని నీడ తాకినా మైలపడతామని దూరంగా పెట్టిన సమాజం… ఇది కథ కాదు… భారతీయ సమాజం లో అమానుషమైన దురాచారం — అంటరానితనం. ... భారతదేశ చరిత్రలో 'అంటరానితనం' ఒక చీకటి అధ్యాయం. మనుషుల మధ్య గోడలు కట్టి, సాటి మనిషిని తాకడం పాపమని భావించిన సమాజం. అగ్రవర్ణాల వారు అనారోగ్యంతో చావడానికైనా సిద్ధపడేవారు కానీ, తక్కువ కులస్తుల చేత వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడేవారు కాదు. 4వ శతాబ్దంలో వచ్చిన పాహియాన్ మొదలుకొని, మనుస్మృతి వరకు అంటరానివారి దుర్భర స్థితిని వివరించాయి. - వారు ఊరికి వెలుపల నివసించాలి. - నగరంలోకి వచ్చేటప్పుడు కర్రతో నేలపై కొడుతూ తమ రాకను తెలపాలి. - పీష్వాల కాలంలో అయితే, తమ అడుగుజాడలు పడకుండా నడుముకు చీపురు, ఉమ్మి నేలపై పడకుండా మెడలో ముంత కట్టుకుని తిరగాల్సిన దుస్థితి ఉండేది. - కేరళలో నాయర్లను తాకితే మైల పడతారని, దళితులు 30 నుండి 64 అడుగుల దూరంలో నిలబడాలనే నియమం ఉండేది. పాఠశాలల్లో కూడా ఈ వివక్ష కొనసాగేది. తక్కువ కులస్తుల పిల్లలను కొడితే బెత్తం మైలపడుతుందని, వారిపై రాళ్లు విసిరేవారు. సాక్షాత్తు బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు కూడా చిన్నతనంలో పాఠశాలలో నీళ్లు తాగడానికి, నల్లబల్ల (Blackboard) తాకడానికి అనుమతి లేక ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో, క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో అడుగుపెట్టి సామాజిక సమానత్వానికి పునాది వేశారు. కుల మత భేదం లేకుండా అందరు పిల్లలను ఒకే వరుసలో కూర్చోబెట్టి చదువు చెప్పడం ప్రారంభించారు. కెప్టెన్ స్టీవార్ట్ వంటి వారు ఈ సమానత్వాన్ని వ్యాప్తి చేశారు. అంటరానితనం వల్ల వైద్యం అందక మరణిస్తున్న వారి కోసం ఆసుపత్రులను నిర్మించారు. చిత్తూరు జిల్లాలోని 'ఆరోగ్యవరం' దీనికి ఒక గొప్ప ఉదాహరణ. గజదొంగగా ఉన్న పాగోలు వెంకయ్య వంటి వారు మిషనరీల బోధనలతో మారి, వేలాది మందికి సేవ చేస్తూ సామాజిక మార్పుకు కారకులయ్యారు. "నీ పొరుగువానిని నీవలె ప్రేమించు" అనే క్రీస్తు సిద్ధాంతంతో మిషనరీలు కుల వివక్ష లేని సమాజాన్ని నిర్మించడానికి కృషి చేశారు. బైబిల్ ప్రకారం మనుషులందరూ దేవుని స్వరూపంలో సృష్టించబడిన వారే. అంటరానితనం అనేది దేవుని సృష్టికి వ్యతిరేకమైన కుట్ర. అందరూ సమానంగా జీవించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం మరియు గౌరవం దక్కుతాయి. జ్యోతిరావు పూలే & సావిత్రిబాయి పూలేలు మిషనరీ పాఠశాలల్లోనే చదువుకున్నారు. అక్కడ వారు నేర్చుకున్న "సమానత్వం" అనే భావనే, తర్వాతి కాలంలో వారు దళితుల కోసం, మహిళల కోసం పోరాడటానికి పునాది వేసింది. విలియం కేరీ సతీసహగమనం, శిశుహత్య వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఈయన చేసిన పోరాటం, అంటరానితనం నిర్మూలనకు తొలి అడుగులలో ఒకటి. ట్రావెన్కోర్ (కేరళ) లో తక్కువ కుల మహిళలు పైవస్త్రం-Jacket (Upper cloth) ధరించకూడదనే నిబంధన ఉండేది. మిషనరీలు వారికి అండగా నిలబడి, గౌరవప్రదంగా జీవించే హక్కును కల్పించారు. "మిషనరీలు అంటరానితనంపై పోరాటం చేసినా, స్వతంత్ర భారత దేశంలో కూడా కుల అహంకారం చావలేదు. దానికి మన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కారంచేడు మరియు చుండూరు మారణకాండలే సాక్ష్యం. కారంచేడులో మంచినీటి చెరువు వద్ద మొదలైన వివక్ష 6 గురు ప్రాణాలను బలితీసుకుంది. చుండూరులో కేవలం ఒక కాలు తగిలిందన్న కారణంతో సాటి మనిషిని ముక్కలు ముక్కలుగా నరికి కాలువలో పారేసిన క్రూరత్వం మనది. ఈ మధ్య, తెలంగాణ, నాగర్ కర్నూల్ లో రెండు నెలల పసిపాపను కూడా వదలకుండా చంపేస్తున్నారంటే, మనం ఏ సమాజంలో ఉన్నామో ఆలోచించాలి. మిషనరీలు ఆనాడు అంటరానివారికి అండగా నిలిచి, వారిని సమానంగా చూశారు. కానీ నేడు కుల వ్యవస్థ మనుషులను మృగాలుగా మారుస్తోంది."